చీకటిని తిట్టే బదులు దీపం వెలిగించు మొదలు
“ చుట్టూ వున్న చీకటిని తిట్టుకుంటూ కూచోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపమైనా వెలిగించడం మంచిది " హైదరాబాద్ లోని సాహిత్య సంస్థ “ యువభారతి " ఈ వాక్యాలను ' మోటో'గా ప్రకటించించేది . చీకటి , వెలుతురు అనే పరిమితార్థంలోనే గాకుండా ఈ వాక్యంలో చాలా లోతు వుంది .
చాలా మంది తమ ఇల్లు , వీధి , కార్యాలయం పట్ల విపరీతమైన విసుగును , అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు . అక్కడ ఎవరూ మంచివారు లేరని , ఏమీ చేయలేమని చెప్పబోతారు . మనం ఏదైనా సలహా ఇవ్వబోతే మీకు తెలియ దంటారు . ' మా వూరి సంగతి మీకు తెలియదు ' మా బాస్ సంగతి మీకు తెలియదు ' ఇలా అంటుంటారు . ఆ మాట నిజమే . వారి పరిస్థితులు మనకు తెలియకపోవడమూ సహజమే . అయితే వాటి గురించి అంత తెలిసిన వారు
కూడా ఎందుకు అంత ' ఇదయి ' పోతున్నారో మాత్రం మనకు అర్థం కాదు . ఎప్పుడన్నా తీరిగ్గా వుండి 'ఏంటి మీ ఆఫీసు సంగతులు' అంటే పెద్ద భారతం విప్పుతారు . తీరా వారు చెప్పేవన్నీ సాదా సీదా సమస్యలు , సాధారణంగా వినిపించే ఆరోపణలే అయివుంటాయి . బయట సంబంధాలు లేకపోవడం వల్ల తమ సమస్యలే చాలా పెద్దవని అనుకుంటూ నిస్పృహను పెంచుకోవడం వల్ల క్రమంగా అసంతృప్తి అనే ఒక ఊబిలో
కూరుకుపోవడంజరుగుతుంది .
నిజం చెప్పాలంటే ఇంటా బయటా ఏవో సమస్యలు , అవరోధాలు వుంటూనే
వుంటాయి . అన్నీ ఏ ఒక్కరి చేతుల్లోనూ వుండవు. పరిస్థితులు కూడా ఒకరి అదుపాజ్ఞలను బట్టిరావు. తాము వుండే చోట గల వాస్తవ పరిస్థితిని గమనించి తదనుగుణంగా వ్యవహరించ గలిగినప్పుడే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు . పరిస్థితులు బాగాలేవని
తిట్టుకుంటూ కూర్చుంటే చివరకు నిష్క్రియా ప్రియులుగా , అసంతృప్త జీవులుగా మిగిలిపోతారు .
తారు రోడ్డు మీద కారు తోలడంలో పెద్ద సమస్య వుండదు . గతుకుల రోడ్డు పైన బండి నడపడానికే పట్టుదల కావాలి . డ్రైవర్ ఎంత బాధపడినా రోడ్డు ఒక్కసారిగా మారిపోదు . అలాగే
చుట్టూ వున్న పరిస్థితులు కూడా ఒక్కసారే తలకిందులైపోవు . ఎక్కడైనా నిబంధనలు , పని
పద్ధతులు దీర్ఘకాలంలో రూపొందుతాయి . కనుక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా తట్టుకుని
నిలబడి నెమ్మదిగా కృషి ప్రారంభించి , ముందుకు సాగడంలోనే మనిషి ప్రజాపాటవాలు బహిర్గత మవుతాయి . దానివల్ల క్రమంగా పరిస్థితులూ మార్చవచ్చు . మనుషులూ మారవచ్చు . జీవిత భాగస్వాములు లేదా కుటుంబసభ్యులు లేదా వృత్తి సహచరుల నుండి మొదట సహాయ నిరాకరణ , ప్రతికూలత కూడా వ్యక్తం కావచ్చు . అయినా మంచి ఉద్దేశంతో ఒక క్రమ పద్ధతిలో
పనిచేస్తే ఆలస్యంగానైనా తప్పక ఫలితం కనిపిస్తుంది . వారు కూడా ఆలోచించడానికి వీలు కలుగుతుంది . పరిస్థితుల వల్లనే వారు అలా తయారై వుండొచ్చు . మన కృషి ఇప్పుడు వారికి కూడా ఉత్సాహం కలిగించవచ్చు . ఒకవేళ వారు మారకపోయినా అనుకున్న మార్గంలో
ముందుకు పోతూనే వుండాలి . ఎవరో మారలేదని మంచి అనుకున్నది చేయకుండా వుండనవసరం లేదు . అలాంటి నిష్క్రియాప్రియత్వం వ్యక్తిగతంగా మీకు కూడా చాలా చెరుపు చేస్తుందని అర్థం
చేసుకోవాలి . నిత్య కృషీవలులుగా వుండే వారికి నిరుత్సాహం దరిచేరదు . ఈ సమాజంలోని
అసమానతలు , వివక్షతల దృష్ట్యా కొందరు యజమానులు , పై అధికారులు లేదా స్త్రీల
విషయంలో భర్తలు కావాలని కఠినంగా , నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించవచ్చు . అప్పుడైనా అన్యాయాన్ని ఎదిరిస్తూనే చేయవలసింది మాత్రం బాధ్యతగా , చక్కగా నిర్వర్తించాలి . దానివల్ల కుటుంబంలో లేదా సంస్థలో సత్ఫలితాలు సాధించడంతో పాటు సాటి వారిలో సదభిప్రాయాన్ని కూడా పొందడానికి వీలవుతుంది. అది సమిష్టి చైతన్యం పెరగడానికి , సమైక్య భావనకు దారితీస్తుంది .
ఎవరికి వారు చేయగలిగింది లేదని చేతులు ముడుచుకుంటే అందరికీ నష్టం కలుగుతుంది . అందుకు బదులు ఏ ఒక్కరు లేదా ఏ కొందరు చొరవ తీసుకున్నా ఇతరుల్లో కూడా
నెమ్మదిగానైనా కదలిక వస్తుంది .
మనిషి సమాజాన్ని మారుస్తాడని చెప్పిన మార్క్స్ కూడా అతను ఉన్న పరిస్థితులలో
ఆ పనిచేయాలని చెప్పాడు . జంతువులకు , మనిషికి తేడా ఏమంటే అవి వాతావరణాన్ని బట్టి పరిణామం చెందడం లేదా నశించడం జరుగుతుంది . మేధాశక్తి సంపన్నుడైన మనిషి అలాగాక పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు . ప్రకృతిని ఒక్కసారిగా మార్చలేక పోయినా అనేక రూపాల్లో క్రమక్రమంగా దాని పై అదుపు సాధించేందుకు సాగిపోతున్నాడు . అలాగే సామాజిక వ్యవస్థలను కూడా మారుస్తున్నాడు . ఈ విజయాలన్నింటికీ ప్రాతిపదిక మనుషుల ఆలోచన , సమిష్టి ఆచరణలే ! చేయవలసింది చేయకుండా ఎంతగా మదనపడినా మిగిలేది మనోవేదన తప్ప మానవాభ్యుదయం కాదు . చాలామంది మదనపడే విషయాలన్నీ అంత తీవ్రమైనవి కావు. అందుకే చుట్టూ వున్న మనుషులను , వాస్తవ పరిస్థితులను . అర్థం చేసుకుని ముందుకేయడానికి ప్రయత్నించడం శ్రేయస్కరం.
(తెలకపల్లి రవి_ నిత్యజీవితం)

Comments
Post a Comment